న్యాయ శాస్త్రవేత్త సాల్మండ్ చెప్పినట్లు సమాజ అభివృద్ధికి చట్టాలు ఎంతో ఉపయోగపడతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో నలుగురిలో ఒక్కరైనా ఉన్నత విద్యావంతులై ఉంటారు. వారిలో సామాజిక చైతన్యం ఉండడమే కాకుండా చట్ట పరమైన పరిజ్ఞానం కూడా ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళు డాక్టర్లయినా, ఇంజనీర్లయినా, వ్యాపారస్తులయినా న్యాయపరమైన అంశాలనెన్నింటినో అవగాహన చేసుకోవడమే కాకుండా వారి, వారి వృత్తులను చట్టబద్ధం(లీగల్) గా నిర్వర్తించు కోవడం జరుగుతుంది.
మానవ జీవితంలో అనేక సమస్యలుంటాయి. ఆ సమస్యల్లో న్యాయ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు ఎవరైనా గాని ఎంతో కొంత సంఘర్షణకు గురికాక తప్పదు. భారతదేశం వ్యవసాయిక దేశం కావడం వల్ల ప్రజలు చదువు విషయంలో వెనుకబడి, చట్టపరమైన పరిజ్ఞానం కొరవడి జీవిస్తున్నారు. చట్ట పరిజ్ఞానం లేనందున ఎవరూ క్షమార్హులు కారు. నేరం తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చట్టం, న్యాయం సంబంధిత అంశాల పైన పట్టు సంపాదించాలి. అందుకోసం ప్రజలు చట్టాలను చదవాలి, శాసనాలను తెలుసుకోవాలి. ప్రజలు చట్టాలను, శాసనాలను అవగాహన చేసుకున్నప్పుడే వారి మధ్య గొడవలకు, వివాదాలకు, వాదనలకు చోటుండదు. అప్పుడే ప్రజలు నేరాలు, ఘోరాలు చేయకుండా, కోర్టుల్లో వ్యాజ్యాలు వేయకుండా చట్ట పరిధిలో శాంతియుతంగా కలిసి ఉంటూ ప్రశాంతంగా జీవిస్తారు. ఇది ప్రత్యక్షంగా, ప్రజలకు పరోక్షంగా సమాజానికి లాభం చేకూర్చుతుంది. ఈ పుస్తకం సామాన్య ప్రజలకు, న్యాయశాస్త్ర విద్యార్థులకు, యువ న్యాయవాదులకు, బ్యాంకర్స్ కు, చర, స్థిరాస్థులు ఉన్నవారికి, రైతులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి ఎంతో కొంతైన ఉపయోగపడవచ్చు
జి. గంగాధర్,అడ్వకేట్